Sunday, May 3, 2015

ప్రభు మేని పైగాలి

Live commentary అంటే మనకి క్రికెట్ గుర్తొస్తుంది. Batsman ఎలా కొట్టాడో, ఫీల్డర్ ఏం చేస్తున్నాడో అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే మనం నోరప్పగించి వింటాం. కాని ఎప్పుడో జరిగిపోయింది, ఇలా జరిగిందని తాను అనుభవించి మన కళ్ళకు అప్పజేప్పటం అంత సులభం కాదు. ఇదంతా ఎందుకంటే, నా కళ్ళల్లో Live commentary కనిపింపజేసిన విశ్వనాథ వారి ఒక పద్యం గురించి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం గురించి చెప్పేటంతటి స్థాయి గాని, అర్ధంచేసుకునేంతటి శక్తి గాని నాకు ఏ మాత్రం లేవు. కానీ ఆ స్థాయి కవి, ఎంత సులభంగా నాలాంటి మామూలు పాఠకుడికి కూడా కళ్ళ ముందు కనిపించేలా చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది, దాంట్లోంచి బయటికి రాలేకే ఇదంతా.

సాధారణంగా ఏ కవైనా, పాఠకుడి స్థాయికి దిగి రచనలు చెయ్యటం పరిపాటి. కాని విశ్వనాథ వారు మాత్రం పాఠకుడిని కొంచెం పై స్థాయికి తీసుకెళ్ళి చదివేలా చేస్తారు. రామాయణ కల్పవృక్షంలో, శివధనుర్బగం ఘట్టంలో వచ్చే ఈ పద్యమే అందుకు ఉదాహరణ. “నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత....” అంటూ ఎక్కడా ఆగకుండా రకరకాల సమాసాలతో వెళ్ళిపోతుంది. ఓసారి, నాలాంటి పాఠకుడు ఎవరో, “ఎందుకు స్వామి, ఇలా రకరకాల సమాసాలు వాడేస్తారు, మాములుగా, ఇలా శివధనుస్సు విరిచాడు అని చెప్తే సరిపోదా” అని అడిగాడట. దానికి సమాధానంగా విశ్వనాథ వారు, “నువ్వు ఊరి నుంచి వస్తూ వుంటే సైకిల్ పేలిపోయి పంక్చర్ అయ్యింది, దాన్ని ఎలా చెప్తావ్” అని అడిగితే,  ఏముంది “నేను ఊరి నుంచి వస్తున్నప్పుడు దారిలో నా సైకిల్ టైరు ఢాం అని పేలిపోయింది అని అన్నాడట. “హా.... ఆ ‘ఢాం’ నే నేను ఇలా సమాసాలుగా చెప్తాను, ఆ శివధనుర్బగం లో వచ్చే పద్యం కూడా అటువంటిదే” అని అన్నారట. అదీ ఆయన స్థాయి. శబ్ధాలను, ఉరుములను, మెరుపులను కూడా కవిత్వం లో జొప్పించగలరు. ఇది తిక్కన గారి శైలికి (దీని గురించి మరో సారి) చాలా దగ్గరగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ స్థాయికవి, ఒక చక్కని ఘట్టాన్ని అంతలా కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే, కనీసపు అవగాహన లేని నాలాంటి వాడు కూడా ఆనంద పరవసుడైపోతాడు. “రాముడు గౌతమముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అహల్య శాప విమోచనం అయిన సంఘటన” అది. మాములుగా అయితే, “రాముడి పాదం తగిలి ఒక రాయి అహల్య గా మారింది” అనో, సినిమా బాష లో చెప్పాలంటే, “ఆ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట” అనో... సింపుల్ గా తెల్చేయోచ్చు. కాని విశ్వనాథ వారి శైలే వేరు. పువ్వు పూయాలంటే, ముందు మొక్కకి కాయ కాయాలి, ఆ తర్వాత మొగ్గ గా మారాలి. ఆ మొగ్గ విచ్చుకోవాలి, మెల్లిగా పూరేఖలన్నీ విచ్చుకోవాలి. అప్పుడే, పువ్వు గా మారాలి. సరిగ్గా ఇదే విశ్వనాథ వారు కళ్ళ ముందు దృశ్యాలు కదిలేలా మన ముందు సాక్షాత్కరింపజేస్తారు ఆయన అనుభవించింది.

ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగె

“రాముని శరీరం నుంచి వీచిన గాలి సోకినంతనే పాషాణానికి స్పర్శ, ఆయన కాలి సవ్వడి వినగానే చెవులు, ఆయన శరీర పరిమళం అనుభూతం కావటంతో ఘ్రాణేంద్రియం (వాసన), నీలిరత్న కాంతులు జల్లుతున్న ఆయన శరీరాంగాలు కనిపించగానే చూపు వచ్చాయి” అని కళ్ళకు కట్టినట్టు ఒక్కోటీ ఎంత అద్భుతంగా ఆవిష్కరింపజేసారో.

ఇటువంటి కవి సామ్రాట్ కనుకనే, కేంద్ర సాహిత్య ఎకాడమి అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు వారయ్యారు ఈ రామాయణ కల్పవృక్షానికి. అంతే కాదు, ఇప్పటి దాక భారతదేశ ఆధునిక సాహిత్యంలో వచ్చిన కథ(నవల) లో ఆయన రాసిన వేయిపడగలు కచ్చితంగా మొదటి పదిలో ఎక్కడోక్కడ పెద్ద పీఠ వేసుకుని కూర్చుంటుంది. ఆయన రచనల్లో కనీసం ఒక రెండు శాతం అయినా అర్ధం చేసుకునే స్థాయి నాకు కలగాలని కోరుకుంటూ.....

No comments:

Post a Comment