Wednesday, April 9, 2014

పురుష నిధానము


రాముడు... భారతదేశంలో పుట్టిన మతం వారికైనా పరిచయం అక్కర్లేని పేరు... ధర్మానికి ప్రతి రూపంగా కొనియాడబడుతున్నవాని పేరు... భారతీయ సత్ సంప్రదాయాలని ఇప్పటికీ ప్రభావింపచేస్తున్న (ఎప్పటికీ ప్రభావింపజేసే) వాని రూపం...

రాముని నడతను, నడకను విపులంగా వాల్మీకి చేత విసదీకరించిందే రామాయణం...  గాధ గురించి అసలు పరిచయమే అక్కర్లేద్దు... దీని మీద ఎందరో మహానుభావులు పులకించి, పరవశించి, అనుభవించి  రాసుకున్న భావాలు ఎన్నోఅలానే,  విమర్శలు చేసి, పుక్కిట (దీని అర్ధం ఏమిటో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) పురాణంగా కొట్టిపారేసిన మహా మేధావులు (??) మరెందరో....

రామాయణ అస్తిత్వాన్ని ప్రశ్నించటానికి బదులు, రాముని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక మానవీయ దృక్పధం అలవడుతుంది అనటం లో సందేహమే లేదు... రామాయణం లో ఒక విషయాన్ని గాని గమనిస్తే, రాముడు తో పరిచయం, అనుబంధం, కనీసం దూరం నుంచి చూసిన ప్రతీ ఒక్కరూ రాముని గురించి పోగిడినవారే గాని, స్వతహాగా  తెగిడినట్లు కనపడదు... ఇంకా చెప్పాలంటే, రామునికి విరోధులుగా చెప్పబడిన వారు కూడా ఇంకా గొప్పగా పొగిడిన వారే…. దానికి సాక్ష్యం మారీచుడు చెప్పిన శ్లోకమే, " రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్య పరాక్రమః" ఇప్పటికీ రాముడు అంటే ఏమిటో చెప్పటానికి వాడబడుతుంది..... నిజమే రాముడు పోత పోసిన  ధర్మం....

గురువుకి శిష్యుడి గా విశ్వామిత్రుడి వెనకాల మారు మాటాడకుండా వెళ్ళి, చెప్పినవన్నీ చేసి, పెళ్లి సమయం లో మాత్రం తండ్రి గారిదే నిర్ణయం అని చెప్పి, కొడుకు గా తండ్రి పట్ల ఎంతటి గౌరవం పాటించాలో ఆచరించి చూపించాడు... అదే తండ్రి, పట్టాభిషేకం చేస్తాను అని, మరుసటి రోజునే అడవికి వెళ్ళిపొమ్మని చెప్పినపుడు లక్ష్మణుడు ఆక్రోశం పొందాడు గాని రాముడు కనీసపు తొట్రుపాటు కూడా పడలేదు... అప్పుడు లక్ష్మణుడితో అంటూ...  నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడూ నాన్నే, ఇవాళ పొద్దుట పిలిచి అరణ్య వాసానికి వెళ్ళిపోమన్నవాడూ నాన్నే... పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడు దేవుడే, వెళ్ళిపో అన్న వాడూ దేవుడే... రెండిటియందు నాన్నలో నేను దేవుడినే చూస్తున్నాను. వెళ్ళిపోమన్నప్పుడు శత్రువుని, రాజ్యం ఇస్తానూ అన్నప్పుడు తండ్రిని చూడటం లేదు, దైవాన్ని అనువర్తించటం నేర్చుకో అని చెప్పటం రామునికి పితృవాక్య పరిపాలన పట్ల ఉన్న గౌరవానికి పరాకాష్ట...

వనవాసం లో ఉండగా, సీతమ్మపై ఒక కాకి వాలి, కండ పీకుతూ ఉంటే, కోపం తో ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటం వినటానికి వేరే విధం గా ఉన్నా, తన భార్య (తను రక్షించవలసిన వారి) జోలికి వస్తే  ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చాటి చెప్పటం తన బాధ్యతల పట్ల, తన కర్తవ్య నిర్వహణ పట్ల ఉన్న నిబద్దతకి పరాకాష్ట...

విభీషణుడు  శరణు కోరుతూ నిలబడినపుడు, వానర సేన అంతా (ఆంజనేయుడు మినహా) విభీషణుడి ని నమ్మకూడదు, అభయమివ్వకూడదు అని అన్నప్పుడు, శ్రీ రాముడు అందరికీ చెప్తూ...వచ్చిన వాడు విభీషణుడే కానీ, రావణుడే కానీ, నన్ను శరణు కోరినవారు ఎవరైనా సరే రక్షిస్తాను, ఒకానొకప్పుడు చెట్టు మీద ఆనందంతో రమిస్తున్న రెండు పావురాలలో, ఆడ పావురాన్ని ఒక బోయవాడి బాణం పెట్టి కొట్టి, పడిపోయిన ఆ ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని మగ పావురం విశేషమైన బాధ పడింది. కొంత కాలానికి అదే బోయవాడు ఆహారం దొరక్క, నీరసం చేత ఆ మగ పావురం ఉన్న చెట్టు కింద పడిపోతే, ఆకలితో పడిపోయిన అతనిని కాపాడటానికి ఆ పావురం ఎక్కడినుంచో ఎండు పుల్లలు, అగ్ని తెచ్చి అతని ఆకలి తీర్చటం కోసం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్య ని చంపిన అదే బోయవాడు తన చెట్టు దగ్గరికి పడిపోతే అదే శరణాగతి అని భావించి, ఆ మగపావురం తన ప్రాణాలు ఇచ్చి మరీ అతనిని రక్షించింది. నేను మనుష్యుడి గా పుట్టి, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములు ఎంచి శరణాగతి ఇవ్వను అని ఎలా అనగలను,  ఈ సమస్త భూమండలము లో నన్ను శరణాగతి చేసిన ఎవ్వరి యోగ క్షేమములైనా నేను వహిస్తాను, అందుచేత విభీషణుడి కి శరణు ఇస్తున్నాను అని చెప్పటం రాముడి కారుణ్యానికి పరాకాష్ట...

ఇలా రాముడి ప్రతీ అడుగు ధర్మాన్ని అనుసరించే వేయబడింది, అందుకే  సీతాయః చరితం మహత్ కూడా  రామాయణం గానే పిలవబడింది... నిజమే రాముడు పోత పోసిన ధర్మం, ఓర్పుకీ సహనానికీ నిలువెత్తు నిదర్శనం, పురుష నిధానము, సుగుణాల భాండాగారం...

రామదాసు గారి పదాలలో....
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !!

అందుకే... బంటు రీతి కొలువు ఈయవయ్య రామా...
 

Monday, March 10, 2014

శంకరాభరణం


మొన్న జనవరికి సరిగ్గా 35 ఏళ్ళు పూర్తిచేసుకున్న సినిమా ఎందుకో గుర్తొచ్చి మరలా ఓసారి చూడాలనిపించింది…. సంగీతంలో ఎలాంటి అనుభవం గాని, అర్హతలు గాని లేని నాలాంటి అర్భకుడికి కూడా, ఆహా ఎంత అద్భుతంగా ఉందో అని అనిపిస్తూనే ఉంటుంది ఎన్ని సార్లు చూసినా…. ఈ చిత్రం లో ప్రతీ సన్నివేశాన్ని హత్తుకునేలా తీసిన దర్సకత్వ ప్రతిభ, వాటికి తగ్గట్టే సంభాషణలు, మరో మెట్టుకు తీసుకువెళ్ళే సంగీతం, దానికి ఇంపైన సాహిత్యం…. ఒకదానితో ఒకటి పోటీ పడ్డట్టు ఉన్నాయి కాబట్టే ఇన్నేళ్ళకి కూడా సాహితీ ప్రియులను, సగటు సినిమా అభిమానిని ఆకట్టుకుంటూనే ఉంది….
సినిమా అన్నాక కధ కంటే కధనానిదే పెద్ద ప్రాత్ర…. అందుకే, ప్రతి సన్నివేశంలోనూ ఆ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే (నాకు అంతలేదు గాని) "శంకర శాస్త్రి అనే సంగీత కళాకారుడి జీవితంలో కాలం తెచ్చే మార్పులు"…. అనే చిన్న కథని చాలా అందంగా తెరకెక్కించారు…. ఇప్పటి బాషలో చెప్పాలంటే హీరో (శంకరశాస్త్రి గారి)  ఇంట్రడక్షన్ సీన్ లోనే చెప్పాలనుకున్నది అంతా చెప్పేశారు…. శంకరశాస్త్రి గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాలికి ఉన్న గండపెండేరాన్ని చూపిస్తూ, అలా తన పంచె కి ఉన్న చిరుగులు చూపిస్తూ ఆపటంలో...... ఏం చెప్పాలనుకుంటున్నారో  చెప్పకనే చెప్పేశారు…. శాస్త్రి గారి ఇంట్లో నాలుగు గొడవ మధ్య ఎక్కడ చూసినా సప్త స్వరాలు వినిపిస్తాయి అని నాలాంటి సగటు ప్రేక్షకుడికి కూడా అనిపించేలా చెయ్యటం…. రెండు ముఖ్య పాత్రల (శంకరశాస్త్రి, తులసి) మధ్య ఒకే ఒక్క డైలాగ్ పెట్టి ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ మలచిన తీరు కచ్చితం గా అభినందిచాల్సిందే…. శాస్త్రి గారిని తిట్టిన జమీందార్ ని చంపి, ఆ రక్తంతో శంకర శాస్త్రి గారి పాదాలు కడిగించిన తీరు మహాభారతం లోని ద్రౌపది-భీముడు-దుశ్శాసనుడు సన్నివేశాన్ని ఓసారి జ్ఞప్తికి తెచ్చేలా చేసింది.. తన కూతురు స్వరాలలో అపశ్రుతి పలికిందని శాస్త్రి గారు చేతిలో కర్పూరం వెలిగించుకుని పాపపరిహారం చేసుకున్న తర్వాత, ఆ చేతికి శాస్త్రి గారి కూతురు వచ్చి వెన్నపూస రాస్తూ, స్వరాలూ సరిగ్గా పాడుతుంటే, ఎన్ని సార్లు చూసినా ఈ సీన్ కి కళ్ళల్లో నీటి సుడులు తిరగక మానవు అంటే అతిశయోక్తి కాదేమో…. అలాగే శాస్త్రి గారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పిల్లాడైన శంకరం ఆయన కాళ్ళు పడుతూ మానస సంచరరేకీర్తన పాడుతూ శ్రీ రమణీ..” అన్న తర్వాత గుర్తుకురాకపోతే శాస్త్రి గారు నిద్రలోనే ఆ తర్వాత అందుకుని పాడటం, ఆయనెంత తాదాత్మ్యం చెందాడో చెప్పడానికి చక్కగా మలచిన సందర్భం…. బ్రోచేవారెవరురా అనే కీర్తనని తప్పుగా పాడుతున్నప్పుడు శాస్త్రి గారిచే చెప్పించిన సందర్భం, పాప్ గ్యాంగ్ కుర్రాళ్ళకి బుద్ధి చెప్పే సందర్భం లాంటి మహోత్తరమైన సన్నివేశాలు కోకొల్లలు….
ఈ చిత్రం లో సంగీతం, పాటలకి కుదిర్చిన సాహిత్యం గురించి చెప్పాలంటే సాహసమే అవుతుంది, తులసి, శాస్త్రి గారు మొట్ట మొదటిగా కలిసే సీన్ లో వచ్చే స్వరాలు, ఒక్క తులసినే కాదు మనల్ని కూడా ముగ్ధుల్ని చేస్తుంది…. కన్నడ సంఘం వారు చేసే సన్మానానికి రైలు దిగి నడిచుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే చిన్నపాటి వీణా నాదం ఆహా అమోఘం…. అలాగే కోర్ట్ సీన్ తరువాత వచ్చే ఫ్లూట్ తో నేపధ్యసంగీతం ఓసారి అలా ఆకాశం లో ఓలలాడించక మానదు…. శాస్త్రి గారిని, శంకరం ప్రసన్నం చేసుకునేప్పుడు వెనకాల మెల్లిగా వచ్చే వేణుగానం వింటే కచ్చితంగా ప్రసన్నం అవ్వాల్సిందే…. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు అని గళమెత్తి పాడుతుంటే, ఆ రాగం వల్ల సాహిత్యానికి అందం వచ్చిందో లేదా సాహిత్యం వల్ల ఆ స్వరాలకు అందం వచ్చిందో తేల్చిచెప్పటం కష్టమే…. అప్పుడు పడుతున్న వర్షాన్ని చూసి, పరవశాన శిరసు ఊగితే ఇలకు ఇలా వర్షంగా జారిన శివగంగ అట, ఆహా ఎంత చక్కని వర్ణన…. ఇంకొక పాట లో అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమే  సోపానము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము అని ఎంత చక్కగా చెప్పెసారో సంగీతం అంటే ఏంటో, నాదోపాసన అంటే ఏంటో.... శాస్త్రీయ సంగీతాన్ని పాశ్యాత్య సంగీతం కబలించేసింది అని చెప్పే సందర్భంలో వాడిన నేపద్యగీతం ఓసారి విని తీర్సిందే, ఎంత చక్కగా చూపించారో ఆ వేరియేషన్…. సందర్భానుసారంగా వచ్చిన కీర్తనలను మాత్రం అత్యద్భుతమే అనాలి…. 
శంకరాభరణం సినిమా పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చేది సంగీతమే అయినా, ఈ సినిమా లో మాటలు (కాదు కాదు ముత్యాలు) మరో అద్భుతమే అని చెప్పాలి.... జంధ్యాల అనగానే మనకి గుర్తొచ్చేవి కామెడీ సినిమాలే అయినా, ఆయనలో ఉన్న రెండో వైపు తరచి చూడాలంటే ఇలాంటి గాభీరమైన సంభాషణలు వినాల్సిందే.... ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు అని కులం, దాని అడ్డుగోడలు గురించి ఎంత సున్నితం గా చెప్పారో…. శాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి ఒక్క ముక్కలో ఆ లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపడనురా మాధవా అని చెప్పిస్తూ, ఆ గుర్రపు డెక్కల చప్పుడు లో కూడా కోపం కనిపిస్తుందిరా దేవుడా అని అనిపిస్తూ సన్నివేసంలో కోపాన్ని జొప్పించటం…. ఆ కీర్తనలోని ప్రతీ అక్షరం వెనుకా ఆర్ద్రత నిండిఉంది, తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండెలోతుల్లోంచి తనకుతానే గంగాజలంలా పెల్లుబికిన గీతమది. రాగమది అంటూ కీర్తన గొప్పతనాన్ని వర్ణించిన వైనం, ఆర్ద్రత గురించి వివరుస్తూ, అది మాటలకు అంతుచిక్కదు అని అంటూనే ఎంత అందమైన పదాల కూర్పు చేసారో, నిజమే అది బాషకి అందని భావన, మనస్సుని ద్రవింప చేసే భావన”…. వేటూరి గారు తనదిన శైలి లో సంగీతం గురించి పాట సాహిత్యంలో చెప్తే, జంద్యాల గారు ఇలా సంగీతానికి భాషాభేదాలు. స్వపరభేదాలు ఉండవు, అదొక అనంతమయిన అమృతవాహిని. ఏ జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు అంటూ “Music is Divine” అని కచ్చితంగా చెప్పేశారు…. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయి, దానికి సరైన విలువ ఇవ్వట్లేదని విలపిస్తూ రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్బాగ్యం తన నుదుట రాయొద్దని వేడుకున్నాడురా కాళిదాసు అంటూ చెప్పించటం వినేవాళ్ళ (చూసే వాళ్ళ) మనసుని మాత్రం బరువెక్కించక మానదు…. ఇక క్లైమాక్స్ సీన్స్ లో మాత్రం జంద్యాల కలం కదం తోక్కిందనే చెప్పాలి, పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్నా సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతిని అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో,వారికి శతసహస్ర వందనాలర్పిస్తున్నాను….” అంటూ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్కవ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని ఇలా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది అని అత్యంత అద్బుతంగా ముగింపు పలికారు….
అందుకే ప్రతీ సన్నివేశం ఒక కళాఖండం లా మలచబడింది కాబట్టే, ఇన్నేళ్ళకి, ఎన్నేళ్ళ కీ కూడా, ఈ చిత్రం అందరి హృదయాలలో కదలాడుతూనే ఉంటుంది, తెలుగు సినీ అభిమాని సగర్వం గా చెప్పుకోగల చిత్రంగా వర్దిల్లుతూనే ఉంటుంది….
నిజమే, సంగీతం అనంతవాహిని, ఈ శంకరాభరణం అజరామరం….
వేటూరి గారి మాటల్లోనే, అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్దికి, గానమే  సోపానము…. సత్వ సాధనకు, సత్య శోధనకు, సంగీతమే ప్రాణము….”
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు….