Wednesday, April 9, 2014

పురుష నిధానము


రాముడు... భారతదేశంలో పుట్టిన మతం వారికైనా పరిచయం అక్కర్లేని పేరు... ధర్మానికి ప్రతి రూపంగా కొనియాడబడుతున్నవాని పేరు... భారతీయ సత్ సంప్రదాయాలని ఇప్పటికీ ప్రభావింపచేస్తున్న (ఎప్పటికీ ప్రభావింపజేసే) వాని రూపం...

రాముని నడతను, నడకను విపులంగా వాల్మీకి చేత విసదీకరించిందే రామాయణం...  గాధ గురించి అసలు పరిచయమే అక్కర్లేద్దు... దీని మీద ఎందరో మహానుభావులు పులకించి, పరవశించి, అనుభవించి  రాసుకున్న భావాలు ఎన్నోఅలానే,  విమర్శలు చేసి, పుక్కిట (దీని అర్ధం ఏమిటో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) పురాణంగా కొట్టిపారేసిన మహా మేధావులు (??) మరెందరో....

రామాయణ అస్తిత్వాన్ని ప్రశ్నించటానికి బదులు, రాముని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక మానవీయ దృక్పధం అలవడుతుంది అనటం లో సందేహమే లేదు... రామాయణం లో ఒక విషయాన్ని గాని గమనిస్తే, రాముడు తో పరిచయం, అనుబంధం, కనీసం దూరం నుంచి చూసిన ప్రతీ ఒక్కరూ రాముని గురించి పోగిడినవారే గాని, స్వతహాగా  తెగిడినట్లు కనపడదు... ఇంకా చెప్పాలంటే, రామునికి విరోధులుగా చెప్పబడిన వారు కూడా ఇంకా గొప్పగా పొగిడిన వారే…. దానికి సాక్ష్యం మారీచుడు చెప్పిన శ్లోకమే, " రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్య పరాక్రమః" ఇప్పటికీ రాముడు అంటే ఏమిటో చెప్పటానికి వాడబడుతుంది..... నిజమే రాముడు పోత పోసిన  ధర్మం....

గురువుకి శిష్యుడి గా విశ్వామిత్రుడి వెనకాల మారు మాటాడకుండా వెళ్ళి, చెప్పినవన్నీ చేసి, పెళ్లి సమయం లో మాత్రం తండ్రి గారిదే నిర్ణయం అని చెప్పి, కొడుకు గా తండ్రి పట్ల ఎంతటి గౌరవం పాటించాలో ఆచరించి చూపించాడు... అదే తండ్రి, పట్టాభిషేకం చేస్తాను అని, మరుసటి రోజునే అడవికి వెళ్ళిపొమ్మని చెప్పినపుడు లక్ష్మణుడు ఆక్రోశం పొందాడు గాని రాముడు కనీసపు తొట్రుపాటు కూడా పడలేదు... అప్పుడు లక్ష్మణుడితో అంటూ...  నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడూ నాన్నే, ఇవాళ పొద్దుట పిలిచి అరణ్య వాసానికి వెళ్ళిపోమన్నవాడూ నాన్నే... పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడు దేవుడే, వెళ్ళిపో అన్న వాడూ దేవుడే... రెండిటియందు నాన్నలో నేను దేవుడినే చూస్తున్నాను. వెళ్ళిపోమన్నప్పుడు శత్రువుని, రాజ్యం ఇస్తానూ అన్నప్పుడు తండ్రిని చూడటం లేదు, దైవాన్ని అనువర్తించటం నేర్చుకో అని చెప్పటం రామునికి పితృవాక్య పరిపాలన పట్ల ఉన్న గౌరవానికి పరాకాష్ట...

వనవాసం లో ఉండగా, సీతమ్మపై ఒక కాకి వాలి, కండ పీకుతూ ఉంటే, కోపం తో ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటం వినటానికి వేరే విధం గా ఉన్నా, తన భార్య (తను రక్షించవలసిన వారి) జోలికి వస్తే  ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చాటి చెప్పటం తన బాధ్యతల పట్ల, తన కర్తవ్య నిర్వహణ పట్ల ఉన్న నిబద్దతకి పరాకాష్ట...

విభీషణుడు  శరణు కోరుతూ నిలబడినపుడు, వానర సేన అంతా (ఆంజనేయుడు మినహా) విభీషణుడి ని నమ్మకూడదు, అభయమివ్వకూడదు అని అన్నప్పుడు, శ్రీ రాముడు అందరికీ చెప్తూ...వచ్చిన వాడు విభీషణుడే కానీ, రావణుడే కానీ, నన్ను శరణు కోరినవారు ఎవరైనా సరే రక్షిస్తాను, ఒకానొకప్పుడు చెట్టు మీద ఆనందంతో రమిస్తున్న రెండు పావురాలలో, ఆడ పావురాన్ని ఒక బోయవాడి బాణం పెట్టి కొట్టి, పడిపోయిన ఆ ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని మగ పావురం విశేషమైన బాధ పడింది. కొంత కాలానికి అదే బోయవాడు ఆహారం దొరక్క, నీరసం చేత ఆ మగ పావురం ఉన్న చెట్టు కింద పడిపోతే, ఆకలితో పడిపోయిన అతనిని కాపాడటానికి ఆ పావురం ఎక్కడినుంచో ఎండు పుల్లలు, అగ్ని తెచ్చి అతని ఆకలి తీర్చటం కోసం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్య ని చంపిన అదే బోయవాడు తన చెట్టు దగ్గరికి పడిపోతే అదే శరణాగతి అని భావించి, ఆ మగపావురం తన ప్రాణాలు ఇచ్చి మరీ అతనిని రక్షించింది. నేను మనుష్యుడి గా పుట్టి, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములు ఎంచి శరణాగతి ఇవ్వను అని ఎలా అనగలను,  ఈ సమస్త భూమండలము లో నన్ను శరణాగతి చేసిన ఎవ్వరి యోగ క్షేమములైనా నేను వహిస్తాను, అందుచేత విభీషణుడి కి శరణు ఇస్తున్నాను అని చెప్పటం రాముడి కారుణ్యానికి పరాకాష్ట...

ఇలా రాముడి ప్రతీ అడుగు ధర్మాన్ని అనుసరించే వేయబడింది, అందుకే  సీతాయః చరితం మహత్ కూడా  రామాయణం గానే పిలవబడింది... నిజమే రాముడు పోత పోసిన ధర్మం, ఓర్పుకీ సహనానికీ నిలువెత్తు నిదర్శనం, పురుష నిధానము, సుగుణాల భాండాగారం...

రామదాసు గారి పదాలలో....
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !!

అందుకే... బంటు రీతి కొలువు ఈయవయ్య రామా...