Wednesday, May 6, 2015

జంతుకులమంతా ఒకటే

అన్నమాచార్య జయంతి కదా అని ఆయన కీర్తనలు వింటుంటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే అనే కీర్తన దగ్గర ఆగాయి ఆలోచనలు. "ఇందులో జంతుకుల మంతా ఒకటే....".  ఇంచుమించు 600 ఏళ్ళ క్రితం ఈ మాట అనటానికి ఎంత ధైర్యం, విచక్షణ కావలి....

ఉన్న గీతని చెరపకుండా చిన్నగా చెయ్యాలంటే, పక్కన ఇంకో పెద్ద గీత గియ్యాలన్నాట్ట ఒక పెద్దాయన. నిజమే, పక్కవాటితో పోలిస్తేనే తేడాలు తెలిసేది..... ఊర్లో వున్నప్పుడు, రెడ్డి, వైశ్య, కాపు అని ఇంకా ఏవో అనుకునేవాళ్ళు...  హైదరాబాద్ వెళ్ళినప్పుడు, తెలంగాణా వోడా? ఆంధ్రో డా? అనేవారు. బెంగుళూరు లో వుంటే, కన్నడా? తమిళా? తెలుగా? అని అడిగితే, నార్త్ లో చదువుకుంటున్నప్పుడు సౌత్ ఇండియన్నా?  నార్త్ ఇండియన్నా? అని. అంటే కవరేజ్ రేంజ్ పెరిగేకొద్దీ, తేడాలు కొంచెం చిన్నవి అవుతాయి మాట.  ఆసియాని కవర్ చేసి చూస్తే, ఇండియన్? చైనీస్? జపనీస్?. యురోప్ లో ఉంటున్నప్పుడు ఏసియన్? యురోపియన్? అమెరికన్? ఇలా... ఇంకొంచెం బయటికి వచ్చి, స్పేస్ నుంచి చూస్తే, భూగ్రహం వాసా? గ్రహాంతర వాసా?? అని తేడా చూపిస్తాం. అప్పటిదాక వున్న ఏసియన్, ఇండియన్, తెలుగోడు, ఆంధ్రోడు అని తేడాలు పోయి ఒకటే మిగిలింది. అంటే కొలించే మొత్తం ఎక్కువయ్యే కొద్ది, కనిపించే తేడాలు చిన్నవైపోతున్నాయి. ఇంకొంచెం దాటి చూస్తే, ఏ ప్లానెట్ సిస్టం, ఏ మిల్కీవే?.....

ఏ అవగాహన లేని నాలాంటి వాడి దృష్టికి ఇలా పరిధులు పెంచుకుంటూ పోతూవుంటే ఆ పరిధి లో వున్నవన్నీ ఒకేలా సమానంగా కన్పిస్తుంటే, ఈ విశ్వానికి అధిపతి, ఈ జగత్తును పాలించే ఆ పరమాత్ముడి దృష్టికి ఈ మొత్తం విశ్వం అంతా ఒకేలా కనిపించటంలో ఆశ్చర్యం ఏముంది. నిజమే, చూసే దృష్టిని బట్టే సృష్టి ఎలావుందో కనిపిస్తుంది. దృష్టి పరిధి పెంచుకుంటూ పోతే అంతరాలు పోయి అంతా సమానమే అని అనిపిస్తుంది.

అందుకే "ఇందులో జంతుకులమంతా ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ".


No comments:

Post a Comment